ఢిల్లీలో రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!

  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా ఎమ్మెల్యేల భేటీ
  • ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన పరిటాల సునీత, ఇతర నేతలు
  • పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఈ సమావేశం
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన భేటీ ఫోటోలు
  • భిన్న రాజకీయ కూటముల నేతల కలయికపై చర్చ
దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే పరిటాల సునీత సహా పలువురు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పరిటాల సునీత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి. 

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల కోసం వివిధ పార్టీల నేతలు ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి, టీడీపీ మహిళా ఎమ్మెల్యేల మధ్య ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.

ప్రస్తుతం టీడీపీ కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉండగా, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇలా భిన్న రాజకీయ ధ్రువాలకు చెందిన నేతలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా కొనసాగిన నేపథ్యంలో పాత పరిచయాల కారణంగానే మర్యాదపూర్వక భేటీ అని భావిస్తున్నారు.  

Revanth Reddy
Paritala Sunitha
TDP
Telugu Desam Party
Telangana Congress
Delhi
Indian Politics
Women Reservation Bill
Parliament

More Telugu News